My Blog List

Tuesday, May 18, 2010

కవిత్వ "మంటే"?

కవిత్వమంటే .....
కొంతమందికి బాగా బోంచేసినట్టు
కొంతమందికి కళ్ళు జ్వలిస్తున్నట్టు
కొంతమందికి అస్థికలు,బొమికలు ,వేపమండలు కనపడుతున్నట్టు
కొంతమందికి డిటెక్టివ్ లు ,సెక్స్ బాంబు లు కనపడుతున్నట్టు
కొంతమందికి కులాలు ,స్త్రీలు ,మైనార్టీలు కనబడుతున్నట్టుగా వుంది.
సరే ,ఎవరి దృక్పథాలు వారికి వుంటాయి .
అయితే,ముందు నువ్వు రాజకీయం చెప్పినా ,మరేదయినా చెప్పినా ,కవిత్వమంటే కవిత్వంగా వుండాలి . అంటే రాసినది ఖచ్చితంగా కవిత్వమై వుండాలి .

ఏది కవిత్వం?

ఫలానాది కవిత్వం,ఫలానాది కవిత్వం కాదు అని చెప్పటానికి వైమర్శిక కొలత బద్దలు లేవు . అందువల్ల కవిత్వాన్ని చదివే పాఠకుడి యొక్క సంస్కారం మీద కవితా స్థాయి ఆధార పడి వుంటుంది . అంటే చదివేటటువంటి వారి హృదయం ,ఏది చదివితే చలిస్తుందో అది ఉత్తమ కవిత్వం . ఏది చదివితే హృదయం పాషాణ ప్రాయమై పోయిందో , కదల కుండా -అది చెత్త కవిత్వమని తేల్చేయ వచ్చు .
కవి అవటానికి ,కాక పోవటానికి ,సమాజానికి పనికి వచ్చే కవిత్వానికి పనికి రాకుండా పోయే కవిత్వానికి తేడా వుంది .ప్రధానం గా మనం చూడ వలసినది కవి అవునా? కాదా?
దీనికి ఏమిటి ఆధారం ?
వ్రాసిన కవిత్వమే దీనికి ఆధారం.
తరువాత ఆలోచించాలి . కవిత్వం మనకు పనికి వస్తుందా? అని.

ఇవాళ మనని వేధిస్తున్న సమస్య ఏమిటంటే , వస్తువు నుండి మనం కవిత్వం చూస్తున్నాం ,చూడవలసిందే . ఇప్పుడు సంప్రదాయకులు ,ఆధునికులు కూడ అలాగే చూస్తున్నారు .పూర్వ అలంకారికులు 'రసధ్వని కావ్యాత్మకం ' అన్నారు. అయితే ,ఆధునికులు ఏమి చెబుతున్నారంటే ,ఆనాడు కావ్యానికి శిల్పం ప్రాణ మైంది . ఈనాడు కావ్యానికి వస్తువు ప్రాణంగా నిలిచింది ......ఇలా భారత దేశం లో వచ్చిన విమర్శకు లందరూ ఎవరికీ తోచిన అభిప్రాయం వారు చెబుతున్నారు.
ఇవాళ వున్న విమర్శకులలో చాలా మంది వస్తువుకే ప్రాధాన్య మిచ్చి ,వస్తువును ఆధారంగా చేసుకుని కవి అవునా కాదా అనేది నిర్ణయిస్తున్నారు .ఇదే సిద్ధాంతం పునాదిగా వచ్చినటువంటి వాళ్ళలో శిల్పాన్ని విస్మరించటం శోచనీయం .
ఒకప్పటి రష్యా లోని ప్రముఖ విమర్శకుడు 'లూనా చేరస్కి ' . ఆయన మేధావి కూడా. రష్యా పోరాట చరిత్ర లో వున్న విజయాలు ,అపజయాలు తెలిసిన వ్యక్తి . జార్ చక్రవర్తుల క్రింద ప్రజలు పడినటువంటి వేదన అవగాహన ఉంది. అయన ఏమి చెప్పాడంటే, "కవి గాని,రచయిత గాని చెప్పదలచుకున్న భావం రాజకీయ నాయకుడైనా చెప్పగలడు,తన ఉపన్యాసం ద్వారా. కాని సాహిత్యానికి ,రాజకీయ నాయకుడి కంటే ప్రజల హృదయాలను ప్రభావితం చేసే శక్తీ ఎక్కువ వుంటుంది ,కనుక కవిత్వాన్ని చదివెట్టువంటి వారి హృదయాన్ని ప్రభావితం చేయాలి అంటే రచన అయినా శిల్ప సహితంగా వుండాలి కాని, శిల్ప రహితంగా , ఉత్త నినాదంగా ఉండకూడదు" అని. ఒక మార్క్సిస్టు విమర్శకుడికి ఉండ వలసిన ప్రాధాన్యం ఏమిటో ఆతను చెప్పుకొస్తూ పై విషయాన్ని వ్రాసాడని కీ.శే. టి.ఎల్. కాంతారావు అన్నారు.
తరువాత రచయిత చెప్పదలచు కొన్నది -ప్రధానంగా కవి దృక్పధం. ఎవరి కోసం చెబుతున్నాడు ? ఎందుకోసం చెబుతున్నాడు ? మొదటి ప్రశ్నకు సమాధానమే రచయిత యొక్క రచనా శిల్ప స్థాయి ఆధారపడి వుంటుంది . ఎందు కంటే , విశ్వనాధ ని కవి కాదన్న వాళ్ళు వున్నారు . గురజాడ ని కవి కాదన్న వాళ్ళు వున్నారు . శ్రీ శ్రీ కవిత్వమంతా చెత్త కవిత్వం అన్న వాళ్ళు వున్నారు . ఎందుకు కవి కాదంటున్నారు ? ఫలానా వాడు కవి అవును అనడానికి కేవలం వస్తువు పునాది అవుతుందా?
సాహిత్యంలో ఇది మంచిది కాదు.
అయితే , విశ్వనాథ వారు సమాజానికి , కాలానికి ఎంత మాత్రమూ పంకిరాని కవి అని నిర్మోహ మాటంగా చెప్పవచ్చు . ఇది వాస్తవం ,అయినా ఆయన కవి కాకుండా పోడు. అలాగే గురజాడ అప్పారావు గారు వీళ్ళ కొలమానాల్లో చూస్తే కన్యాశుల్కం లో హీరోయిన్ ఎవరు? హీరో ఎవరు? ఇందులోన రసము ఏమిటి? ఇవన్ని ఆలోచించి గురజాడ ను కవి కాకుండా చేయటానికి అకవి అనే పదం ఆనాడు సృష్టించారు. సృష్టి లో పొట్ల పల్లి సీతారామయ్య లాంటి వాళ్ళు పాల్గొని గురజాడ మీద కావలసినంత దుమ్ము చల్లారు .చిత్ర మేమిటంటే ,కొందరి నిర్ణయాలతో కవులూ చావరు. అలాగే నిర్ణయాలతో కవులు బతకరు. అక్కిరాజు ఉమా కాంతం గారు భావ కవులందరిని దుమ్మెత్తి పోయాలనే ఉద్దేశ్యంతో నేటి కాలపు కవిత అనే పుస్తకం రాసారు. కాని సాహిత్య చరిత్ర ఇప్పటికి రుజువు చేసిన సత్యం ఏమిటంటే ,నేటి కాలపు కవిత అనే పుస్తకం చచ్చి పోయింది . పుస్తకం లో కవులయితే పనికి రారని రాసారో కవులందరూ,వాళ్ళు చచ్చి పోయినప్పటికీ ,వాళ్ళ కవిత్వం జీవించే వుంది. అందుకే నిజంగా కవి అయిన వారిని ఎవరూ చంపలేరు. కవి కాని వాడ్ని ఉపన్యాసాలతో పొగడ్తలతో ఎవరూ జీవింప చేయలేరు. ఇది నిజము. అందుకనే దుష్ట విమర్శలు దుష్ట సమీక్షలు ,కవుల్ని బతికించ లేవు ,చంపలేవు. అయితే విమర్శ లన్నిటి లొనూ వస్తు దృక్పధం పూర్తిగా కనపడుతుందని స్పష్టం గా చెప్పు వచ్చు .

విశ్వనాథని కవి కాకుండా చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన వ్యాకరణ దోషాలు ఉద్గ్రంధాలు గా వచ్చినా కవి గా చావలేదు. అల్లాగే త్రిపురనేని రామస్వామి మీద విమర్శల వల్ల ఆయన హేతువాదం చావలేదు.
" మనం ఆలోచించేప్పుడు నేత్రాలను,మేధస్సును పరిశుబ్రం చేసుకుని చదవటం ,ఆలోచించటం చేయక పోయినట్లయితే కవిత్వం ఎప్పుడూ అకవిత్వం గానే కనపడుతుంది. "

పద్యమే కవిత్వమా?

వచనాన్ని ఛందోబద్దం చేసినంత మాత్రాన పద్యం కాదు. పూర్వం చాలా చచ్చు విషయాలను కూడ పద్యాలలో చెప్పారంటే దానికి కొన్ని కారణాలు ఉనాయి. నాటికి సంకేతిక పెరుగుదల లేదు. కాగితం లేదు . ముద్రణా సౌలభ్యం లేదు . అందుచేత ఆనాడు వచనం వికసించలేదు . ఏది చెప్పినా సంక్షిప్తంగా వుండాలి. వచనాన్ని పేజీలకు పేజీలు గుర్తుంచుకో లేరు . అందువల్లనే ఆనాడు శాస్త్ర జ్ఞానం చెప్పినా, గణితం చెప్పినా అన్ని శ్లోకాల లోనే చెప్పారు. శ్లోకాలలో క్లుప్తత వుంది. క్లుప్తత స్పేస్ ప్రాబ్లం ని కవర్ చేస్తుంది . ఆనాడు ఎన్ని ఉద్గ్రంధాలు వచ్చినా ,అందులో కవిత్వాన్ని ఎరుకోంటే కొంతే కనపడుతుంది. కాగా కథ ప్రాధాన్యమైన గ్రంధాలు ఎక్కువ. పద్యం లోనే రాస్తేనే కవిత్వం అనే భ్రమలో ఇవాల్టికి కొంతమంది వున్నారంటే ,వీళ్ళని ఎం చేసినా మారారు.

కథాకావిత్వం

ఇవాళ కవిత్వంలో కథ అనవసరం. కథ ఒక పక్కకి వెళ్లి పోయింది . కథకు కావలసినంత మంది వున్నారు. కవిత్వంలో కథ యొక్క అవసరం లేదు. ఆనాడు భారతం కాని,రామాయణం కాని కథా ప్రధానమైన కావ్యాలు ప్రతిదీ పద్యం లోనే రాయవలసి వచ్చింది. నన్నయ్య గారి భారతం చదివిన ప్రతి వారికీ, ఇవాళ వస్తూన్న పద్యాలన్నీ దండగ అనిపిస్తుంది . వచన కవిత్వం లో కథా కావ్యాల గురించి కుందుర్తి కీ ,తిలక్ కీ మధ్య చర్చ జరిగింది. వచన కవిత్వంలో కథా కావ్యాలు రావాలని కుందుర్తి వాదన, అవసరం లేదని తిలక్ ఆవేదన. కుందుర్తి ఎంత ఆధునికుడై నప్పటికీ ,ఆయన లోపల ఒక వేదన వుండేది. ఇప్పుడు వచ్చిన ఆధునిక కవితాన్ని అంతటినీ , వయాకరనుల చేత ,పండితుల చేత ,ఆలంకారిక శాస్త్రజ్ఞుల చేత మెప్పించాలానే ఆరాటం. "మెచ్చ నంటావు నీవు, మెచ్చకుంటే మించి పోయే ,కొయ్య బొమ్మలే మెచ్చు " అని గురజాడ చెప్పినట్లుగా ,ఎవరు మెచ్చినా మెచ్చక పోయినా ప్రవాహం ఆగదు. విషయం కుందుర్తి కి తాను జీవించిన కాలంలో తెలియ లేదు.

అనుభూతి

అనుభూతి అంటే కొంత మందికి ఒంటి మీద గొంగళి పురుగులు పాకినట్టు వుంటుంది. అనుభూతి అంటే బ్రహ్మ పదార్ధం కాదు . కవిత్వం లో అనుభూతి వాదానికి వ్యతిరేకంగా చాలా మంది వున్నారు. ఇదే విషయం లో ఇంద్రగంటి కి ,కే.వి.అర్ కి మధ్య గతంలో కొన్ని దస్తాలు ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. అనుభూతిని వైయుక్తక మైనటువంటి దానిగా మనం సంకుచిత పరచనక్కర లేదు. ఒక బలవంతుడు ,బాగా బలహీనుడిని కొడుతున్నాడను కొండి . మనం అందరం చూస్తున్నా ఒకే రకంగా స్పందిం చము . ఒకరు చాలా తీవ్రంగా స్పందిస్తారు. ఒకరు మనకెందుకులే పొమ్మను కుంటాడు. ఒకరు ఇంకా కొట్టాలి మాత్రం చాలదు అనుకుంటారు . అనుభూతులు దేని మీద ఆధారపడి వుంటాయి ?
ప్రపంచం లో జీవించే ప్రతి వ్యక్తీ కూడ తనకు తెలిసో తెలవకో ఒక వర్గ స్వభావాన్ని కలిగి వుంటాడు. అది మెలకువ లో నయినా కావచ్చు ,సుషుప్తి లోనయినా కావచ్చు. లేకపోతె వర్గ స్వభావం అతనికి స్పష్టంగా తెలిసి వుండక పోవచ్చ్చు . వర్గ స్వభావం లేకుండా రచన చేయటం, వర్గ స్వభావం లేకుండా పటనాన్ని కొనసాగించటం అనేది ఇంతవరకు ఎవరకూ చిక్కు పడని విషయం.
పైన చెప్పినట్టు బలం ఉన్నవాడు బలహీనుడిని కొడుతున్నాడు . బలం అనేది ఒక గుర్తు. బలం అనేది రకరకాలు గా ఉండ వచ్చు. ఒక్క శారీరకమే కాదు. సమర్థించే వాడు ఎందుకు సమర్తిస్తున్నాడు . మనకెందుకు ,ఇంకా కొట్టాలి అనే రకాలుగా అనుకుంటున్నాడు? ఇక్కడ విమర్శ వచ్చేసరికి కేవలం అలంకార శాస్త్రాలు చాలవు . అలంకార శాస్త్రం ఒక్కటే ఎందుకు చాలదంటే , మనం లేచింది మొదలు మన చుట్టూ వున్న జీవితం ,మన జీవితం ,మన నరాల ఇంపల్స్,జీవితమ్ లో వున్న అనేక సంగతులు . మనల్ని ప్రభావితం చేస్తున్న మార్గాలు,మన మానసికమైన కారణాలు ,ఇవన్ని కూడ మన అనుభూతి మీద పని చేస్తాయి. పై సంఘటన తీసుకుంటే,అసలు ఎందుకు కొట్టాలి వాడ్ని అన్యాయంగా అని ఒకరు చాల ఊగి పోతారు, దీనికి అతని కారణాలు అతనికి వుంటై . ఇంకా కొట్టాలి వెధవని అనుకునేవారు వుంటారు,దీనికి ఇతని కారణాలు ఇతని కుంటాయి . కొడితే కొట్టనియ్లే మన కెందుకు? మనని కాదుగా కొట్టేది అనుకుని వెళ్లి పోఎవాడికి ,వాడి కారణాలు వాడి కుంటాయి . ప్రవర్తన లన్నింటినీ ఊరికినే తప్పుకు పోవటం అన కూడదు. పుట్టినప్పటి నుండి కూడ అతని పెరుగుదలలో ,పెరుగుతున్న విధానంలో,ప్రభావితం చేస్తున్నటువంటి కారణాలు అవుతాయి.
పై సంఘటన వస్తువుగా ఒకరు కవిత్వం రాసాడను కుందాం ,రెండవ రకం చదివే వాడు , ..ఇది చెత్త కవిత్వం అని తేల్చి పారేస్తాడు. ఇంకొకరు మొదటి రకం మనస్తత్వాన్ని ఆధారం చేసుకున్న్నవాడు ,ఇదే కవిత్వాన్ని తీవ్రంగా అనుభవిస్తాడు. అందువల్ల రాసినవాడికి ,చదివిన వాడికి కూడ ఒకే రకమైన దృక్పథం వుండాలి.
కవిత్వం రాసేవాడుదృక్పథంతో నయితే రాస్తాడో ,చదివేవాడు కూడ అదే రకమయిన దృక్పథం తో చదవటం వల్లనే కవిత్వం అద్భుతంగా కనిపిస్తుంది .
రకమైన మానసిక కారణాల అంతరం వల్ల విశ్వనాధ ని హృదయ పూర్వకంగా మెచ్చుకున్న వాడు ,త్రిపురనేని ని మెచ్చుకోడు ,అలాగే త్రిపురనేని మెచ్చుకున్న వాడు విశ్వనాధ ని మెచ్చుకోడు. విశ్వనాధ వారన్నట్టు ఎవరి జీవలక్షణం వారిది.

Tuesday, May 11, 2010

లయ-నా పెళ్లి తరవాత సన్నివేశం

లయ సీరియల్ లో

ఎట్టకేలకు నా(వెంకట్రావు) పెళ్లి ,ఆజాద్ (మాధవయ్య ) చేస్తాడు.
అప్పటివరకు మామూలు దుస్తులు ధరించే నేను పెళ్లి తరవాత ఇన్ షర్ట్ చేయడం మొదలు పెడతాను .
అసలు పెళ్లి చూపుల దగ్గర నుంచే
ఇన్ షర్ట్ చేయటం మొదలు పెడతా ననుకోండి .
ఒక సారి ఆజాద్ ను చూడకుండా వెళుతుంటే ,నన్ను పిలుస్తాడు .
నేను
తండ్రి ని కాబోతున్నానని చెప్పటం,అతని ప్రతిస్పందన చూడండి.






Tuesday, May 4, 2010

పగటి వేషాలు-శక్తి వేషం-వీడియో

జానపద కళలలోపగటి వేషాలకు ప్రత్యేకత వుంది. అందులో శక్తి వేషానికి సంబందించిన చిన్న వీడియో చూడండి . మిగతా వేషాలకు సంబందించిన చిన్న చిన్న వీడియో లు కూడ నా దగ్గర వున్నాయి. పోస్ట్ చేస్తాను .